జగిత్యాల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లో లైబ్రరీ చిచ్చు..గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంలో అసంతృప్తి

జగిత్యాల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లో లైబ్రరీ చిచ్చు..గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంలో అసంతృప్తి
  • మొన్న డీసీసీ, తాజాగా గ్రంథాలయ సంస్థ చైర్మన్  ఆశించి భంగపడ్డ జువ్వాడి సోదరులు
  • వెల్మ సామాజికవర్గ నేతలకు మరోసారి మొండిచేయి 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్  అంతర్గత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.  ఇటీవల జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా సంగనభట్ల దినేశ్​ నియమించడమే ఇందుకు ఊతమిచ్చింది.  ఈ నియామకం చుట్టూ జరిగిన పరిణామాలు వెల్మ వర్గంలో అసంతృప్తికి దారి తీసినట్లు తెలుస్తోంది.  

సీనియర్​ నేత జువ్వాడి కృష్ణారావుకు డీసీసీ చీఫ్​గా అవకాశం రాకపోవడంతో, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ ఇన్​చార్జి జువ్వాడి నర్సింగారావు, తదితర నాయకులు కలిసి కృష్ణారావు పేరును లైబ్రరీ చైర్మన్  పదవికి సిఫార్సు చేశారు. 

ఈ ఇద్దరు నేతలు వెల్మ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో, తమ వర్గానికి ఈసారైనా ప్రాధాన్యత లభిస్తుందని ఆశించారు. కానీ, చివరికి స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్, మరో మంత్రి సాయంతో  బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సంఘనబట్ల దినేశ్​ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బల్దియా ఎన్నికల్లో సంగనభట్ల దినేశ్​ సతీమణి కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌గా గెలవడంతో మున్సిపల్  చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్  పదవి ఆశించారు.

కానీ, పద్మశాలి వర్గానికి చెందిన నాగలక్ష్మికి కేటాయించడంతో దినేశ్​అలక పూనినట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను  బుజ్జగించేందుకు గ్రంథాలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌  పదవి కట్టబెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  కాగా, ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో మంత్రులుగా, పీసీసీ, డీసీసీ చీఫ్​లుగా చక్రం తిప్పిన వెల్మ సామాజికవర్గాన్ని కాంగ్రెస్​హైకమాండ్​వరుసగా దూరం పెట్టడం విశ్లేషకులను సైతం విస్మయపరుస్తోంది. అటు  డీసీసీ పదవి దక్కకపోవడం, ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ పదవిలోనూ నిరాశ ఎదురవడంతో జువ్వాడి సోదరులు సైతం నారాజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.